3-SARATH SAHITHYAM SESHA PRASNA VIPRADASU by SARATH CHANDRA CHATARJI Telugu book cover

3-SARATH SAHITHYAM SESHA PRASNA VIPRADASU

by SARATH CHANDRA CHATARJI

₹200
In stock · 218 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శేషప్రశ్న పలు సమయాల్లో పలు వ్యవహారాల కోసం, పెక్కు బెంగాలీ కుటుంబీకులు పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆగ్రా పట్టణమొచ్చి స్థిరపడిపోయారు. తరతరాలుగా ఉంటున్నవారు కొందరు, కొద్దికాలం క్రితమే వచ్చినవారు మరికొందరు, ప్లేగు, మశూచికం లాంటి ఉపద్రవ సమయాలను మినహాయిస్తే వీరి జీవితం అతి నిర్విచారంగా, నిర్విఘ్నంగా ఉంది. పాదుషా కాలంనాటి కోటలు, మహలులు వీరు చూచినవే. నవాబుల ఫకీరుల, శిథిలమైన శిథిలమౌతున్న చిన్నా-పెద్ద సమాధుల లిష్టంతా వీరికి కంఠస్థమే! ఎంతవరకంటే ప్రపంచ ఖ్యాతిగాంచిన తాజమహలులో కూడా వీరికేమీ నూతనత్వం కన్పించదు. సంధ్య వేళల నిరాశాపూరితమైన సజల నేత్రాలను విప్పార్చి, వెన్నెల రాత్రులతో అర్ధనిమీలత నేత్రాలతో నిరీక్షిస్తూ, చీకటి రాత్రులలో కళ్ళు చించుకొని యమునకు ఈ వైపు నుంచి తాజమహలు సౌందర్యాన్ని గ్రోలిన కట్టు కథలన్నీ వీరు తాగి వడపోసినవే. తాజమహలును చూసి ఏ మహామహుడు ఎప్పుడు ఏమన్నాడో, ఎవరెవరు కవిత్వం రాశారో, భావావేశంలో ఎదురుగా నుంచుని ఎవరు గొంతుకు ఉరిపోసుకు చావటానికి ప్రయత్నించారో వారికంతా తెలుసు. చరిత్ర జ్ఞానంలో కూడా వీరు వెనుకబడి వున్నట్టు కనపడదు. ఏ బేగం సాహబా పురిటిగది ఏదో, ఏ జాట్ సర్దార్ ఎక్కడ రొట్టెలు కాల్చుకు తిన్నాడో, అక్కడపట్టిన మసి ఎంత ప్రాచీనమైందో, ఏ బందిపోటు ఎన్ని మణిహారాలు దొంగిలించాడో, వాటి విలువెంత ఉంటుందో వారికి పసిపిల్లాదిగా తెలుసు. వీటిలో ఏదీ వారికి తెలియనిదంటూ లేదు. ఇంత జ్ఞాన సంపత్తితో నిశ్చింతగా వున్న బెంగాలీ సంఘంలో ఒకనాడు కలకలము కనిపించింది. ప్రతిరోజూ యాత్రికులు వస్తూ పోతూనే వున్నారు. అమెరికన్ టూరిస్టుల దగ్గర్నుంచి బృందావనం నుండి తిరిగివచ్చే వైష్ణవ సమూహం వరకు గుంపులు కూడుతూనే ఉన్నారు. కాని ఎవరికీ దేనిలోనూ ఉత్సాహం కనిపించటం లేదు. పనిపాటలతో రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో "ప్రౌఢ వయస్కుడైన బెంగాలీ బాబు ఒకాయన విద్యావతి, రూపవతి, యౌవనవతియైన తన కుమార్తెను వెంటబెట్టుకుని ఆరోగ్యం కోసం వచ్చాడు. పట్టణానికి దూరంగా ఒక పెద్ద బంగళా అద్దెకు తీసుకున్నాడు. వెంట దాస దాసీలు, నౌకర్లు చాకర్లు, వంట మనుషులూ, కోచ్ సహా పరివారమంతా వచ్చింది. ఇంతకాలం ఖాళీగా పడివున్న ఆ పెద్ద భవంతి గారడీలా రాత్రికి రాత్రి కళకళలాడింది. ఆ మహాశయుని పేరు ఆశుతోష్ గుప్త, కుమార్తె పేరు మనోరమ. వీరు గొప్పవారనీ, కలవారనీ సునాయాసంగానే తేలిపోయింది. అయితే పైన ఉదహరించిన కలకలము ఆశుబాబు నిరభిమానం, శిష్ట్లాచరణకు కలిగినంతగా వారి ధన సంపదలను ఊహించుకొన్నందు వల్ల గానీ, మనోరమ విద్యా సౌందర్యాల ఖ్యాతివల్లగానీ కలుగలేదు. అతను స్వయంగా కుమార్తెను వెంట బెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి పరిచయం చేసుకొని, 'నేను రోగిష్టిని,