
AGNIVEENA BICHCHAGALLA PADAALU
₹120
In stock · 476 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సమధర్మ శృతిలో అనిసెట్టి కవితా గానం "మీతోనే వుంటాను, మీతోనే వస్తాను; అడుగడుగునా మీకు అండగ నిలుస్తాను. "పరతంత్రతలో మగ్గు బానిసల ముక్తికై కదన భూముల కెత్తి కదలి వెళ్ళే మీకు అడుగడుగునా నేనే అండగ నిలుస్తాను!" - అని 1942లో బానిసత్వ విముక్తికై పురోగమించే స్వాతంత్య్ర వీరులకు అనిసెట్టి వాగ్దానం చేశాడు. అదే సంకల్పంతో ఎన్ని కష్టాలెదురైనా వెనుతిరగక 1950 వరకూ అక్షర పోరాటం జరిపాడు. సర్వతోముఖ ప్రతిభాశాలిగా సోదరుడు అనిసెట్టి సుబ్బారావు విజయవంతంగా నిర్వహించని సాహిత్య ప్రక్రియయే లేదు. ఎన్నో ఉత్తమశ్రేణి కథలు రాశాడు. రంగస్థలంపై విజయవంతమైన ప్రయోగాత్మక నాటకాలు రచించాడు. రేడియో కోసమో, రంగస్థలంకోసమో ఎన్నో గొప్ప నాటికలు రచించాడు. అభ్యుదయ రచయితల 5వ మహాసభ సంచిక 'అభ్యుదయ'లో ప్రచురితమైన 'చెప్పుక్రింద పూలు' చదివితే - అతని నవీన శిల్ప చాతుర్యం తెలుస్తుంది. అలాంటి నాటికలు-ఆకాశవాణి విజయవాడ కేంద్ర ఆర్కెవ్సులో సుమారు పాతిక ముప్పయి దొరుకుతాయి! రేడియోవారికోసమే - జానపద గీతాలెన్నో సేకరించి వ్యాఖ్యానాత్మకంగా ప్రసారం చేశాడు. 1948 నుంచి అభ్యుదయ శక్తులపై విరుచుకుపడిన ఘోర నిర్బంధకాండలో నిత్యం పోలీసు వేటకుక్కలు తరుముతూంటే తలదాచుకోను స్వగృహానికి చేరితే అమ్మగారు ఆదరించారు; కాని తండ్రి కోటిలింగంగారు కట్టుబట్టలతో ఇంటినుంచి గెంటేశారు. అలాంటి దుర్మార్గ పరిస్థితుల్లో- “చెడ్డా పడ్డా చెన్నపట్నం" అన్న సామెతగా మద్రాసు చేరుకున్నాడు. సినిమాలకు రాయడం, కడుపుకింత సంపాదించుకుని బ్రతకడం పరమధ్యేయమైననాడు - జాతికి చేసిన వాగ్దానం ఎలా నిలుపుకోగలడు? ఎవరి నిర్మల వాగ్దానాలను మాత్రం కొసవరకూ నిర్వర్తించనిస్తోందీ దుర్మార్గ వ్యవస్థ? సామాన్య ప్రజానీకపు బ్రతుకులు దావానల దగ్ధమయ్యాయి. "మీ ఉనికికే ముప్పు ముంచి వచ్చిన నేడు - మీ స్వతంత్ర జగత్తు నిర్మించ పోరాడు" తున్న సోదర ప్రజాశ్రేణులను విడిచి తన బ్రతుకు తాను చక్కపెట్టుకోక తప్పిందికాదు. అభ్యుదయ కవులలో ఋషితుల్యుడైన అనిసెట్టి ఉత్త మనిషిగానైనా తన్నుతాను మిగుల్చుకోడమే బ్రహ్మ ప్రళయమైపోయింది.