
BHARATHIYA TATWASASTRAM SULABHA PARICHAYAM
₹120
In stock · 18 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పీఠిక భారతీయ తత్వశాస్త్రంలోని సాంప్రదాయక శాఖలను సులభరీతిలో పరిచయం చేయటం ఈ పుస్తకం లక్ష్యం. కనుక కొన్ని పరిమితులకు, బాధ్యతలకు నేను లోబడి ఉన్నాను. ఆ గుర్తింపుతోనే ఈ రచన చేశాను. ఆ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాను. మొదటిది, ఇది కేవలం ఒక సులభ పరిచయం. కనుక వస్తువు విషయంలో నిర్దిష్ట బాధ్యతలు, రూపం విషయంలో పరిమితులు ఉన్నవి. రెండవది, భారతీయ తత్వశాస్త్ర సాంప్రదాయ శాఖలను పరిచయం చేసేందుకు ఉద్దేశించిన రచన ఇది. కనుక దీని పరిధి సంకుచితం. భారతీయ ఆలోచనా స్రవంతిపై సంపూర్ణ సమీక్ష కాదు. సులభ పరిచయం గనుక, పాఠకులకు, విషయంతో ఎట్టి పూర్వపరిచయం లేదనే ప్రాతిపదికపై రచన సాగించాను. భారతీయ తాత్వికాభివృద్ధి ప్రత్యేక లక్షణాలు మొదలైన అంశాలపై, కొన్ని ప్రాథమిక చర్చలు అనివార్యం ఔతాయి. ఈ చర్చలలో భారతీయ తత్వవేత్తల, తాత్వికశాఖల, గ్రంథాల పేర్లు తప్పనిసరిగా వస్తాయి. భారతీయ తత్వశాస్త్రంపై చదివే మొదటి గ్రంథం ఇదే ఐన పాఠకులకు, ఈ పేర్లు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. కనుక వీటన్నిటిని అక్షరక్రమంలో, కొద్దిపాటి వివరణలతో ఇవ్వటం అవసరం అనిపించింది. ఇది పాఠకునికి అన్వయ సౌలభ్యం కలిగించగలదు. కొన్ని పేర్లకు భారతీయ ఉచ్ఛారణ, అరుదుగా వచ్చే సాంకేతిక పదాల పట్టికను కూడా చేర్చాను. సులభ పరిచయ గ్రంథం సహజంగానే, క్లుప్తంగా, సాంకేతిక పదరహితంగా, తేలికగా, చదివేందుకు వీలుగా ఉండాలి. ఇలా చేయటంలో తాత్వికనైశిత్యాలు, మూల గ్రంథ వివరాలు వదిలివేసే ప్రమాదం ఉంది. ఫలితంగా భారతీయ తత్వ శాస్త్రంపై శల్యపంజరం మాత్రమే మిగులుతుంది. అంతకుమించి అదనంగా ఏమీ చేయటానికి నేను ప్రయత్నించలేదని అంగీకరిస్తున్నాను. వివరణలు, నోట్సు వీటన్నిటినీ గ్రంథ భారాన్ని తగ్గించేందుకు చివర చేర్చాను. కుతూహలం గల పాఠకునికి కొంత పరిహారంగా ఉపయోగపడవచ్చు. భారతీయ తత్వశాస్త్రంలోని కొన్ని ప్రముఖ గ్రంథాలను ఇందులో ప్రస్తావించే అవకాశం లభించింది. సాధారణ పాఠకునికి అందుబాటులో ఉండే గ్రంథాలనుండే ఉల్లేఖనలను ఇవ్వాలనే నా ఆదుర్దాలో, ఇలాంటి గ్రంథాలన్నింటినీ నేను ప్రస్తావించ లేకపోయినాను. భారతీయ భాషలలో, సాంప్రదాయ పండితులు తత్వశాస్త్రంపై వ్రాసిన ఉద్గ్రంథాలను నేను ప్రస్తావించలేకపోయి నందుకు విచారిస్తున్నాను. నా మాతృభాష బెంగాలీ ఐనందున, దిగ్గజాలైన మహా మహోపాధ్యాయ చంద్రకాంత తర్కాలంకార, ఫణిభూషణ తర్కవాగీశులను మాత్రమే పేర్కొనగలిగాను, శుక్లాజీ సాంగీవీ, రాహుల్ సాంకృత్యాయన్ వంటి హిందీ రచయితలను కదాచిత్తుగా మాత్రమే పేర్కొన్నాను. ఇతర భారతీయ భాషలలో కూడా ఎన్నో ప్రముఖ రచనలున్నాయని నాకు తెలుసు. మన జాతీయ భాషల ప్రతిష్ఠను గురించిన అవగాహన రోజు రోజుకూ పెరుగుతున్నది. ఈ భాషలోని గ్రంథాలపట్ల ఇదివరకటికంటే హెచ్చు శ్రద్ద వహిస్తామనే ఆశాభావం నాకున్నది.