
HITHUDA O RAHASYA SNEHITHUDA
₹60
In stock · 101 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఇది పుస్తకరూపంలో వస్తున్న నా మొదటి నవల. నా కథలు కొన్నింటిని ఏర్చి కూర్చి, 'అద్దంలో చందమామ' పేరుతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. తొలి కథాసంపుటి, తొలి నవల కూడా విశాలాంధ్ర ద్వారా రావడం నాకెంతో సంతోషంగా వుంది. కేవలం నాలుగేళ్లక్రితం రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టాను. దానికి పరోక్షకారకులు మా నాన్నగారు. మా అందరి చదువులకోసం మా కుటుంబం హైదరాబాదులో వుండేది. నాన్నగారు మా వూరు (దేవరయాంజాల), యీ నగరం మధ్య తిరుగుతూ వుండేవారు. ఆయన సిటీకి వస్తున్నట్టు నాకు స్కూల్లోనే తెలిసిపోయేది. మా కారుహారన్ని బట్టి పసికట్టేదాన్ని. మరీ అతి చనువు లేకపోయినా, ఆయనపట్ల గౌరవం వుండేది. నాన్నగారిని చూస్తే, అనిర్వచనీయమైన ఆపేక్ష ఆవరించినట్టు వుండేది. కొండంత ధైర్యం, శక్తి వచ్చినట్టు అనిపించేది. అలాంటి మంచుకొండ ఒకరోజు శాశ్వతంగా కనుమరుగైంది. ఆ నిజాన్ని తట్టుకోవడం నాకు అసాధ్యమైంది. మర్చిపోవడానికి నేను, మరిపించడానికి నా శ్రేయోభిలాషులు విశ్వప్రయత్నం చేశారు. కాని, ఆయన జ్ఞాపకాలు నన్ను వీడలేదు. ఆ శూన్యంలోంచి బయటపడడానికి నేను యీ "అక్షరాభ్యాసం" చేశాను. మనసుని యీ వ్యాపకంతో నింపడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నమే నా రచనావ్యాసంగానికి పునాది, కథలు, నవలికలు పత్రికలలో రావడం, కొందరు బాగున్నాయని అభినందించి ప్రోత్సహించడం యివన్నీ నాకు వూరట కలిగించాయి, వుత్సాహాన్నిచ్చాయి. మా వాళ్లలో రచనా వ్యాసంగంలోకి వచ్చినవారు బొత్తిగా లేరు. కాలేజి రోజుల్లో అప్పటి పాప్యులర్టర్స్ రచనలు ఆసక్తిగా చదివేదాన్ని. నేను పల్లెప్రాంతంలో వున్నది తక్కువ. పెంపకం, చదువు అన్ని సిటీలోనే. కాకుంటే, సెలవులకు మరికొన్ని ప్రత్యేక సందర్భాలకు మావూరు వెళ్ళేవాళ్ళం. బాల్య స్మృతులు యిప్పటికీ నా మనసులో చెదరకుండా వున్నాయి. ఒకతరం క్రిందటి పల్లె సంస్కృతి, ఆనాటి మనుషులు, వారి మనస్తత్వాలు నా మనసు పొరల్లో పదిలంగా వున్నాయి. భాషాపరంగా నా పరిధి చాలా చిన్నది. పైగా తెలంగాణ ప్రాంతీయభాష, నగరజీవితపు పలుకుబడి నాలో కలగలిసిపోయాయి.