
KONA SEEMA KATHALU-80
by DR.DAVULURI SRI KRISHNA MOHANARAO
₹80
In stock · 3 available
PublisherDR.DAVULURI SRI KRISHNA MOHANARAO
LanguageTelugu
1. ఉదాత్తత ఆయ్ఁ... నా పేరమ్మిరాజండి. ఏదో సాదాసీదావోళ్ళం. నేను నిక్కర్లు తడిపేసేటప్పుడే మా అయ్య అయిపోయాడు. మా అమ్మ వాళ్ళన్నగారు కుస్తీల కామరాజునడ్డెట్టుకొని మా పెద్దయ్య కొడుకులు మా భూమి లాక్కోకుండా చూసుకొని బండి లాక్కొచ్చింది. నన్ను హైస్కూలయిపోయేదాక చదివించేసింది. హైస్కూల్ చదువులు చదివానా, అయినా నన్ను అమాయకుడు నోట్లో నాలుక లేదు ఎలా బతుకుతాడో అనేది. ఎలాగైనా నాది ఆళ్ళ అయ్య పేరు కదా. అయినా ఏ తల్లయినా అంతేలెండి, కొడుకు కళ్ళెదుటే దుకాణం పెట్టేసినా '‘నా కొడుకు శ్రీరామచంద్రుడే, అదే ఆడ్ని అమాయకుడ్ని చేసి ముగ్గులో దింపేసింది లంజముండ' అని దాన్ని తిట్టిపోస్తాది. మాది రాజోలు, గన్నవరం మధ్యనుండే మొండెపులంక గ్రామం. రోడ్డు పక్కనే రాజోలుపోయే పెద్ద కాల్వ, ఆ పక్కనే వశిష్ట గోదారి, ఊరు చుట్టూరా చెరుకు తోటలు, వరిచేలు, చేలగట్ల మీద కొబ్బరి వరసలతో పచ్చగా, చిక్కగా బెల్లం పానకంలా తీయగా ఉండే వూరు మా వూరు. కాల్వకి గోదారికి మధ్య ఉన్న లంక చేల్లో రకరకాల పంటలతో అక్కడక్కడో మకాంతో భూలోకంలోకి స్వర్గలోకం షికారుకొచ్చినట్లుంటాది. పేరేమో మరీ మోటు, మొండెపులంక, ఆ పేరెట్టినాడెవరో కాని ఆడ్ని అడ్డంగా చెరకు గెడను నరికేసినట్లు నరికేసి వశిష్ట గోదారిలో పడేయాలి. నాతో హైస్కూల్లో చదివిన జతగాళ్ళు ముగ్గురున్నారు. వాళ్ళలో నెంబర్ వన్ అబద్దం గాడు. ఆడికి ముందు పుట్టినోళ్ళందరూ పురుటిగది దాటి రాకపోతే యములాళ్ళను బురిడీ కొట్టించేయాలని వాళ్ళమ్మ ఆడికాపేరెట్టి ఆడికబద్దాలు నూరిపోసింది. దొడ్లో కోడిపెట్ట గుడ్డెడితే అత్తగారు దాన్ని చూడకుండా బొడ్లో దాచేసి గుద్దెట్టలేదని అబద్దం చెప్పి అత్తగారు పెత్తనాలకెళ్ళినప్పుడు గుడ్డు అట్టేసుకొని తినేసేది. ఆడికో ముక్కపెట్టేది. ఏడుకొండలు రెండోవాడు. ఆడికి హైస్కూల్లో ఉన్నప్పటినుంచి కొంచెం హుషారెక్కువే. ఆడపిల్ల కనబడితే కళ్ళు తిప్పకుండా చూస్తూ చొంగ కార్చుకునేవాడు. అందుకే ఆది పెళ్ళం పెళ్ళయిన ఆర్నెల్లకే విడాకులిచ్చేసింది. మూడోవాడు అన్నారం. నాలాగే సాదాసీదా మనిషి. చదువు పూర్తయిపోయిన తర్వాత వ్యవసాయం పనులు చూసుకుంటూ, ఖాళీ టైములో కొంచెం చాటుగా ఉండే అన్నారంగాడి గొడ్లసావిడి అరుగు మీద పేకాడుతూ కాలక్షేపం చేసేవాళ్ళం.