
TELUGUNATA SAMAJIKA CHALANAM
₹40
In stock · 311 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అనువాదకుని ముందుమాట ఈ సంవత్సరం జూన్ నెలలో ప్రముఖ చరిత్రకారులు శ్రీ భట్టిప్రోలు హనుమంతరావుగారు ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ఆంధ్రుల సామాజిక చరిత్ర, మధ్యయుగాల వరకు, చారిత్రికాధారాలతో రాయవలసిందిగా వారిని నేను చాలాసార్లు కోరి ఉన్నాను. అందుకు అంగీకరించారు కూడా. వారి ఆకస్మిక మృతి ఫలితంగా తీరని' కోరికను, పూర్తి చేయాలనే ఉద్దేశంతో వారి భార్యను, సోదరులను కోరగా, వారు రాసిన వ్యాసాలను నేను అనువదించటానికి అంగీకరించారు. ఆ మేరకు 1) యుగయుగాల ఆంధ్ర బ్రాహ్మణుల కథ. 2) వ్యాపార వర్గాల్లో సామాజిక చలనం 3) బోయలు సామాజిక ఊర్ధ్వ చలనం 4) జైన, వీర శైవాలు సంస్కృతీకరణలో నిర్వర్తించిన పాత్ర అను నాలుగు వ్యాసాలను అనువదించి ఇప్పుడు పుస్తక రూపంలో ప్రచురిస్తున్నాము. వారిపట్ల, వారికి కృషి పట్ల నాకుగల గౌరవభావంతో ఈ అనువాదాన్ని నేను చేపట్టినాను. హనుమంతరావుగారు ఏది చెప్పినా శాసనాధారమో, గ్రంథాధికారమో లేనిది చెప్పరు. నాలుగు వ్యాసాల చివర వారు అనేక శాసనాలను ఉదహరించారు. ఆ పట్టికలో ముఖ్యమైన ప్రస్తావనలను మూలంలోనే చేర్చాను. మిగతా వాటిని వదలివేశాను. ప్రామాణికతకు ఎక్కడా లోటు రానీయలేదు. ఇలాంటి వ్యాస సంపుటి తెలుగులో ఇంతవరకూ లేదు. సురవరం ప్రతాపరెడ్డిగారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రధానంగా సాహిత్యాధారాలతో సాగింది. ఒకటి రెండు ఇతర గ్రంథాలున్నా, చరిత్ర రచనలో ప్రామాణికత సంతరించుకొన్న శ్రీ హనుమంతరావుగారి రచన ఆంధ్రుల సామాజిక చరిత్ర రచనలో మొదటిది అని చెప్పవచ్చు. అన్ని కులాలు, బ్రాహ్మణులతో సహా సామాజిక ఊర్ధ్వచలనం ద్వారా వర్ణ వ్యవస్థలో భాగం పొందినవారే అనేది ఈ గ్రంథంలోని ముఖ్యాంశం. ఇతర వర్ణాల విషయం ఎలా ఉన్నా, బ్రాహ్మణులు మాత్రం సూటిగా ఉత్తర హిందూస్థానం నుండి వచ్చిన వారేనని, ఏదో కొద్దిపాటి సామాజిక ఊర్ధ్వచలనం ఉండి ఉండవచ్చునని కొందరు వాదిస్తారు. అది అవాస్తవమైన భ్రమ మాత్రమేనని హనుమంతరావుగారు సాధికారికంగా నిరూపించారు. ప్రతి వర్ణము ప్రతి కులము తమ ప్రాచీనతను వేదాలవరకు పొడిగించుకునే దురభిమానం, ఈ గ్రంథ పఠన ద్వారా ఏ మాత్రం తగ్గినా, ఈ రచన ఫలవంతమైనట్లే. విజయవాడ ఇట్లు ఏటుకూరు బలరామమూర్తి అనువాదకుడు