
VEERA TELANGANA -NA ANUBHAVALU GNAPAKALU
₹50
In stock · 270 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
హైదరాబాదు సంస్థానం భారతదేశంలోని సంస్థానా అన్నింటిలోకి హైదరాబాదు సంస్థానం చాలా పెద్దది. ఆనాటికి దాని జనాభా ఒక కోటీ అరవై లక్షలు. దేశంలోని సంస్థానాలన్నీ ఒకే మూసలో ఉండేవి. మైసూరు, తిరువాన్కూరు లాంటి కొన్ని సంస్థానాలు మాత్రం ఇందుకు కొంత భిన్నంగా వుండేవి. భాషాపరంగా చూస్తే హైదరాబాదు సంస్థానాన్ని తెలంగాణా, మరాట్వాడా, కర్ణాటక అనే మూడు ప్రాంతాలుగా విభజించవచ్చును. ఈ మూడు ప్రాంతాల్లోనూ నలభై శాతం వరకు జాగీర్ల ఏలుబడి వుండేది. ఈ జాగీర్లలో సాలీనా నలభై లక్షల రూపాయలు ఆదాయం వచ్చేవికూడా వుండేవి. ఈ దృష్ట్యా నైజాము నవాబు కూడా ఒక రకం పెద్ద జాగీర్దారే. అతని స్వంత ఖర్చుకుగాను హైదరాబాదు నగరం పరిసర ప్రాంతమంతా వుండేది. దానికి "అత్రాఫ్బిల్టా" అని పేరు. ఇదికాక వివిధ జిల్లాలలోనూ ఇరవై తాలూకాలు కూడా వుండేవి. ఇలాగ స్వంత ఖర్చుకోసం ఏర్పడిన ఈ ప్రాంతాన్నంతటినీ "సర్ఫేఖాస్" అనేవారు. మతపరంగా చూస్తే సంస్థానంలో 88 శాతం హిందువులు. మిగిలిన దాంట్లో ముస్లిములు, క్రైస్తవులు, తదితరులు వుండేవారు. పరిపాలనా భాగాలు: పరిపాలన కోసం ఒక లెజిస్లేటివ్ సభ వుండేది. దానిలో సభ్యులందరూ దాదాపు నవాబుచేత నియమితులే. జాగీర్దార్ల ప్రతినిధులు ఇద్దరు. ఫస్టుగ్రేడు ప్లీడర్లచే ఎన్నికైన ప్రతినిధులు ఇద్దరు కూడా వుండేవారు. పరిపాలనా నిర్వహణకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (కేబినెట్) వుండేది. దీనికి నాయకత్వం వహించే ప్రధాన మంత్రి కూడా నవాబుచేత నియమితుడైనవాడే. న్యాయ, కార్యనిర్వాహక శాఖలు విడివిడిగా వున్నా అవి పరస్పరాశ్రయంగానే వ్యవహరించేవి. ఇలాంటి పరిపాలనా శాఖలు పేరుకు ఎన్నివున్నా నవాబుగారి ఫర్మానాకు మాత్రం తిరుగు వుండేదికాదు. నవాబుగారి పరిపాలనను ఒక్క ముక్కలో చెప్పాలంటే కల్తీలేని రాచరిక వ్యవస్థ అని చెప్పవచ్చును. పౌరసత్వాలు : ఆనాడు హైదరాబాదు సంస్థాన ప్రజలకు పౌరసత్వహక్కులు అంటే అందని మాని పండ్లకిందే లెక్క పత్రికా స్వాతంత్ర్యం మృగ్యం. గోల్కొండ పత్రికను స్థాపించాలనుకున్నప్పుడు దానిలో "ఆంధ్ర" అన్న పదం వుండేలాగ చూడాలనుకున్నారు. కాని "ఆంధ్ర" అని వుంటే ఆ పత్రికను అనుమతించబోమని చెప్పింది నిజాంగారి ప్రభుత్వం. అందుకని దానికి గోల్కొండ పత్రిక అని పేరు పెట్టుకొనవలసి వచ్చింది. నవాబుగారి ఆశ్రయంగల ఉర్దూలో మాత్రం ఆ రోజుల్లో పది పన్నెండు దినపత్రికలుండేవి. ఆ రోజుల్లో తెలుగులో పత్రిక పెట్టాలన్నా, అలా పెట్టిన పత్రికలో ఏదైనా వ్రాయాలన్నా దానికి కేబినెట్ అనుమతిని పొందవలసి వుండేది.